తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి లింగ్యా నాయక్ (85) ఇవాళ ఉదయం కన్నుమూశారు.
కొంతకాలంగా లింగ్యా నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని సొంత ఇంట్లో నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర పర్యవేక్షణలో ఉన్న సంగతి తెలిసిందే. తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె వెంటనే మేడారం నుంచి పెద్ద తండాకు బయలు దేరారు.
మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ఫోన్లో ఆమెను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు..సంతాపం తెలిపారు.