తమిళనాట దాదాపు నాలుగువేల దుస్తుల ఫ్యాక్టరీలు ఉంటే వాటిల్లో దాదాపు మూడు లక్షల మహిళలు పనిచేస్తున్నారు.
రోజంతా పది గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తేనే వారికి పూర్తి జీతం వస్తుంది. నెలసరి సమయంలో కనీసం మూడు రోజులపాటు సెలవు పెట్టాల్సి వస్తే, ఉద్యోగాలే ఊడతాయి. తప్పని సరై ఆ సమయాల్లో కూడా పనికి హాజరవుతున్నారు. రుతుస్రావం వల్ల వచ్చే నీరసం, బలహీనత కొన్ని గంటల పాటు పనిచేయనీయదు. వారికి గంట విశ్రాంతి కూడా ఇవ్వరు. మూత్రానికి వెళ్లిన పది నిమిషాల్లో తిరిగి రావాలి. మూత్రానికి కూడా ఎక్కువ సార్లు పోనీయరు.వెళ్తే, గంటకింతా, అరగంటకింతా అని జీతం కట్ చేస్తారు… అని సంచలన విషయాలు వెల్లడి చేసింది…థామ్సన్ ఫౌండేషన్. వీరు ఇటీవల తమిళనాడులోని, వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తోన్న మహిళలతో మాట్లాడగా పై విషయాలు వెల్లడయ్యాయి.
రుతుస్రావం సమయంలో మహిళలకు పెయిన్ కిల్లర్స్ లాంటి మాత్రలను యాజమాన్యాలే సరఫరా చేస్తున్నాయి.థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ ఇటీవల వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తోన్న వంద మందికి పైగా మహిళా కార్మికులను ఇంటర్వ్యూ చేయగా వారిలో 90 శాతం మంది ఇలాంటి పిల్స్ తీసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
ఈ తమిళ పరిశ్రమలు అన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిన అవసరం ఉంది. పదేళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా, ఉత్తర ఆంధ్రాలోని విశాఖ జిల్లాలో ‘ బ్రాండిక్స్ ఇండియా అపారెల్ పార్క్’ ని ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు 20 వేల మంది దుస్తుల తయారీలో పనిచేస్తారు. అనేక సౌకర్యాలతో పాటు నెలలు నిండిన ఉద్యోగినులకు మెటర్నటీ లీవ్ సౌకర్యం కల్పించి, ఆరు నెలల పాటు సెలవు ఇచ్చి వేతనం చెల్లిస్తారు. తమిళనాడు వస్త్ర పరిశ్రమ ఈ బ్రాండిక్స్ కంపెని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.