కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలపడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జాప్యం చేసిందని పలు దేశాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తాజాగా మరో వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కరోనా సమాచారాన్ని చైనా కంటే ముందు ఆ దేశంలోని తమ కార్యాలయం తెలియజేసిందని తెలిపింది.
వుహాన్లో న్యూమోనియా వంటి కేసులు నమోదైన సమయంలో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని గత ఏడాది డిసెంబర్ 31న తమ ఆఫీస్ తెలిపిందని పేర్కొంది. అదే రోజు అమెరికాలోని డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ ఎపిడిమియోలాజికల్ నిఘా నెట్వర్క్ ప్రోమెడ్ కూడా వుహాన్లో న్యుమోనియా కేసులు బయటపడినట్టు పేర్కొంది.
న్యుమోనియా కేసుల వెనుక ఉన్న కారణాల గురించి స్పష్టంగా తెలియడం లేదని వెల్లడించిందని తెలిపింది. ఆ నివేదికను పరిశీలించి కొత్తరకం వైరస్ కేసుల గురించి తాము జనవరి 1, 2 తేదీల్లో చైనా అధికారులను సమాచారం కోరామని చెప్పింది. దీంతో ఈ వివవాలను చైనా జనవరి 3న తెలిపిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తమకు డ్రాగన్ దేశం పట్ల ఎలాంటి సానుకూల ధోరణి లేదని స్పష్టం చేసింది.