పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దు ప్రాంతాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్లో కూడా కొద్ది రోజులు విమానయాన సేవలు రద్దు చేశారు. ఇటీవలే తిరిగి విమానాలు పున: ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల మధ్య త్వరలో జరుగాల్సిన పెళ్లివేడుక రద్దయింది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా ఖేజాద్ కా పార్ గ్రామానికి చెందిన వరుడు, పాకిస్థాన్లోని అమర్కోట్ జిల్లా సినోయ్ కు చెందిన వధువు వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది.
శనివారం జరుగనున్న ఈ పెళ్లి వేడుక కోసం వరుడి తరుపు బంధువులు థార్ ఎక్స్ప్రెస్లో వెళ్లేందుకు టిక్కెట్లు కూడా బుక్ చేశారు. పాక్లోని లాహోర్-భారత్లోని అట్టారి మార్గాల మధ్య ఈ రైలు సేవలందిస్తుంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో పాక్ అధికారులు ఈ రైల్వే మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పెళ్లికి ఆటంకం ఏర్పడింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. కేవలం ఐదుగురికి మాత్రమే వీసా ఇచ్చారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులందరికి శుభలేఖలు అందజేశామని వరుడి బందువులు అంటున్నారు.