జమ్మూకశ్మీర్ పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కసు తో పాక్ ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత పరంగా అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఒకవేళ ఉగ్రవాదులు ఆకృత్యాలకు పాల్పడితే, ఈసారి రెట్టింపు స్థాయిలో భారత్ నుంచి సమాధానం ఉంటుందని తేల్చి చెప్పారు. పాక్లోని బాలాకోట్లో భారత్ పెద్ద ఆపరేషన్కు సిద్ధమైందన్న సమాచారం తనకు తెలుసని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై స్పందించాలని మంత్రిని కోరడంతో.. ఆయన మాట్లాడుతూ .. ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించేందుకు మంత్రి ఆసక్తి కనబర్చకపోయినా, ప్రధాని నేతృత్వంలో దేశంలో పటిష్ఠ భద్రత ఉందన్నారు. జమ్ము కశ్మీర్ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆర్టికల్ 370ను రద్దు చేశామని అన్నారు. ప్రస్తుతం ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అన్ని చట్టాలు కశ్మీర్లోనూ చెల్లుబాటు కానున్నాయి.. అని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
నేటి ఉదయం పాక్ దళాలు జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు జరుపగా, సందీప్ థాపా అనే భారత జవాను వీరమరణం పొందాడు. తమ జవాను ప్రాణాలు కోల్పోయిన కొన్ని గంటల్లోనే భారత్ ప్రతీకారం తీర్చుకుంది. రాజౌరీ సెక్టార్ కు సమీపంలో పాక్ భూభాగంలో ఉన్న ఓ సైనిక పోస్టును భారత బలగాలు నేలమట్టం చేశాయి. ఈ ఘటనలో పలువురు పాక్ సైనికులు హతులై ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోంది.