కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా తదితర భారీ తారాగణం ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ శివార్లలో జరిగిన షెడ్యూల్లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రస్తుతం జరగబోయే మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఒక విలేజ్ సెట్ ను వేస్తున్నారని, దానికి సినిమాలో “నరసింహ రెడ్డి గూడెం” అనే పేరు ఉంటుందని, ఈ విలేజ్ సెట్ లో ఒక గ్రూప్ సాంగ్, అలాగే ప్రధాన పాత్రధారులంతా పాల్గొనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ పర్యవేక్షణలో ఈ సెట్ రూపకల్పన జరుగుతోందట. త్వరలోనే ఈ సెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి షూటింగ్ మొదలుపెట్టనున్నారని సమాచారం.