ఇటీవల విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈదాడిపై ప్రాధమికంగా పలు అనుమానాలు వ్యక్తం అవడంతో ప్రత్యేక రక్షణ కూడా ఆయనకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అప్పటి నుండి విచారణ జరుపుతున్న అధికారులు, తాజాగా ల్యాబ్ నుండి అందాల్సిన నివేదికలు అన్ని అందటంతో.. కేసులో నిజాలు తేటతెల్లం చేశారు.
జగన్ పై దాడి అంతా పక్కా ప్రణాళికతో చేసిందేనని, అంతా ప్రచారం కోసం తప్ప మరొక ఉద్దేశ్యం లేదని అధికారులు స్పష్టం చేశారు. దానిచేయించేప్పుడు కూడా ఆ కత్తులను జాగర్తగా రెండు మూడు సార్లు ఉడకబెట్టి మరి ప్రణాళిక అమలుచేశారని అధికారులు వెల్లడించారు. దాదాపు 90 మందికి పైగా విచారణ చేసిన అనంతరం ఈ కేసుపై స్పష్టత వచ్చినట్టు వారు తెలిపారు. మొదట అక్టోబర్ 18న దాడికి ప్రయత్నించారు, కానీ అది వాయిదా పడటంతో 25న పక్కా ప్రణాళికతో దాడి జరిగిందని లడ్డా తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ నుండి 2 కత్తులు స్వాధీనం చేసుకున్నామని, జగన్ కు హాని జరగకూడదనే ఉద్దేశ్యంతో శ్రీనివాస్ కత్తులను రెండు సార్లు ఉడకబెట్టినట్టు ఆయన తెలిపారు. జగన్ చొక్కా, కత్తి, ల్యాబ్ నివేదికలు అందాయని ఆయన తెలిపారు.