తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. తమకు సమర్పించే నివేదికలో అధికారులు అతితెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా క్యాటగిరి చేశారని, బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్ మీరే కదా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కార్మికులకు బకాయి పడ్డ మొత్తానికి సంబంధించిన వివరాలను ఈ నెల 31లోపు కోర్టుకు తెలపాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది.
మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించినట్లు చెపుతున్న రూ.4,253 కోట్లు బకాయిలు ఉన్నాయా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాను ఇస్తున్న వివరాలను పరిశీలించకుండానే ఆర్థికశాఖ కార్యదర్శి కోర్టుకు నివేదిక సమర్పించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 1కి వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి కూడా నవంబర్ 1న జరిగే విచారణకు హాజరు కావాలని తెలిపింది.