తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం భూమికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు తెలిసేలా రూపొందించిన ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇకనుంచి రైతులు, ప్రజలు తమ భూములకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. ఎలాంటి వివాదాలులేకుండా క్లియర్గా ఉన్న (పార్ట్-ఏ) వ్యవసాయభూముల వివరాలన్నీ ధరణిలో పొందుపరిచారు.
ఇంటర్నెట్లో dharani.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్తే ఈ వివరాలన్నీ లభిస్తాయి. రికార్డ్స్ ఆఫ్ రైట్ (ఆర్వోఆర్) చట్టం ప్రకారం భూమి యాజమాన్య హక్కులను ధ్రువీకరించే 1(బీ) పట్టాతోపాటు భూమి వివరాలను, స్వభావం, అనుభవదారుల వివరాలు తెలియజేసే పహాణీలను కూడా ఈ వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. భూమి సర్వేనంబర్లకు సంబంధించిన స్కెచ్లను కూడా ధరణిలో అందుబాటులో ఉంచారు.