కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట జిల్లాలో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత గుర్రం సత్యనారాయణరెడ్డితో పాటు సుమారు 2 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గుర్రం సత్యనారాయణరెడ్డితో పాటు కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నల్లగొండ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తక్కెళ్లపల్లి రవీందర్రావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీది అని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తాం. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్కు దేశాన్ని పాలించే అర్హతలు ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.