తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై టీఎస్ ఎస్ఈసీ చీఫ్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 18న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించి.. 20లోగా నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
నోటిఫికేషన్ వచ్చే వరకు ఓట్ల నమోదుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు 1 కోటి 57 లక్షల ఓటర్లు ఉన్నారని, ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ జాబితా అందించామన్నారు. ప్రతి మండలానికి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు బలగాల కోసం మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో చర్చించామని నాగిరెడ్డి తెలిపారు.