గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తి దిగువన వదులుతున్నారు.
అలాగే ..రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ మీదుగా ప్రయాణించి.. 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నట్టుగా తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఇక ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.
ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం..
అంతేకాకుండా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ వర్షపాతం కంటే 60 శాతం అధికంగా వర్షపాతం ఈ జిల్లాల్లో నమోదైంది. ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 95 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం, వరంగల్ అర్బన్లో 75 శాతం, నారాయణపేటలో 72 శాతం, కరీంనగర్ జిల్లాలో 64 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది.