తొలి టెస్టుకు టీమిండియా యువ బ్యాట్స్మన్, కీపర్ రిషభ్పంత్ను దూరం పెట్టారు. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు. అతడికి బదులు సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహాను తుదిజట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. గతేడాది జనవరిలో గాయం కారణంగా ఆటకు దూరమైన సాహా తర్వాత శస్త్రచికిత్స చేయించుకొని కొన్నాళ్లు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యువకీపర్ పంత్ వెలుగులోకి రావడం.. ఇంగ్లాండ్, ఆసీస్ పర్యటనల్లో రాణించడం చకచకా జరిగిపోయాయి. రిషభ్పంత్ తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీమిండియాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అతడు ఇటీవలి కాలంలో నిర్లక్ష్యపు షాట్లు ఆడి అనవసరంగా వికెట్ సమర్పించుకుంటుండంతో తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్నాడు. గత నెలలో జరిగిన విండీస్ పర్యటనలోనూ పంత్ సరిగా రాణించకపోవడంతో తాజాగా అతడిని తప్పించారని తెలుస్తోంది. కోహ్లీ మాట్లాడుతూ పంత్కి సరైన అవకాశాలు ఇచ్చామని అతడు సద్వినియోగం చేసుకున్నాడని చెప్పాడు. అలాగే సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్ అని, గతంలో అతడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడని గుర్తు చేశాడు. సరైన సమయంలో సాహాను జట్టులోకి తీసుకొస్తున్నామని కోహ్లీ వెల్లడించాడు.