ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికల సందర్భంగా ఆరోజు ఓటరు తమ హక్కును వినియోగించుకోడానికి వస్తున్నారు. ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి ఏపీలోని తమ సొంతూళ్లకు చేరుకుని పోలింగ్లో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఆర్టీసీ, రైల్వే శాఖలపై ‘సంక్రాంతి’ తరహా ఒత్తిడి కనిపిస్తోంది. హైదరాబాద్తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో సుమారు 35లక్షల మంది వరకూ ఆంధ్రా ఓటర్లున్నట్లు ఓ అంచనా. పెద్ద పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు ఏవిధంగా అయితే ముందుగానే ప్రయాణ రిజర్వేషన్ చేయించుకుంటారో.. ఈ ఎన్నికల్లోనూ అదే తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏప్రిల్ పదో తేదీ రాత్రి బయలుదేరి పదకొండో తేదీ ఉదయం ఇళ్లకు రానున్నారు. ఫలితంగా ‘ఏప్రిల్ 10న’ ప్రధాన నగరాల నుంచి ఏపీకి వచ్చే బస్సులు, రైళ్లల్లో రిజర్వేషన్లు ‘ఫుల్’ అయిపోయాయి. సికింద్రాబాద్ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే పలు రైళ్ల స్లీపర్క్లాస్ లో వెయిటింగ్ లిస్ట్ 200 నుంచి 400కు చేరుకుంది. దీనితో ఆయా రైళ్లల్లో బుకింగ్ ఆపేశారు. ఏసీ బోగీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
నరసాపూర్, గౌతమి ఎక్స్ప్రె్సలలో స్లీపర్ క్లాస్ వెయిటింగ్ లిస్ట్ 401కు చేరింది. ఏపీ మీదుగా ఒడిసా, కోల్కతా వెళ్లే రైళ్లలోనూ ఇదే రద్దీ ఉంది. గరీభ్రద్లోనూ ఇదే పరిస్థితి. ఏప్రిల్ 11న ఓటేసిన తర్వాత తిరిగి వెళ్లేవారికి రిజర్వేషన్ ఉంటే సరే. లేదంటే చుక్కలు తప్పవు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14, 15 తేదీల వరకూ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. అందుకే దక్షిణమధ్య రైల్వే రద్దీని దృష్టిని పెట్టుకుని అదనపు బోగీలు, లేదా ప్రత్యేక రైళ్లను వేయడంపై పోలింగ్ రోజుకు కొద్ది రోజుల ముందుగా నిర్ణయం తీసుకుంటామని విజయవాడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ సీహెచ్ సురేశ్ చెప్పారు.
సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రతిరోజూ 24 ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు టీఎస్ ఆర్టీసీకి కలిసి వచ్చాయి. పోలింగ్ కోసం ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడంతో రూ.25లక్ష వరకూ ఆదాయం వస్తుందని అంచనా. తెలంగాణ నుంచి ఏపీకి రోజూ 615 బస్సులు తిరుగుతుంటాయి. వీటిలో 105 బస్సులు ఒక్క హైదరాబాద్ నుంచే నడుస్తాయి. ఏపీలో ఎన్నికలను పురస్కరించుకుని హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఉండే ప్రజలు పెద్ద మొత్తంలో సీట్లను రిజర్వ్ చేసుకున్నారు. ప్రతి రోజూ 20 నుంచి 25 శాతం మేర సీట్లు మాత్రమే రిజర్వ్ అవుతుంటాయి. కానీ ఏప్రిల్ 10న రిజర్వేషన్ల జాతర నడుస్తోంది. రద్దీని బట్టి మరో 20 అదనపు బస్సులు కూడా నడిపే యోచనలో అధికారులు ఉన్నారు.