telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మోడీ మరోసారి ప్రధానిగా.. పట్టాభిషేకం .. 8వేలమంది అతిధులు.. కార్యకర్తల కుటుంబాలు కూడా..

modi nomination in varanasi today

నేడు నరేంద్రమోదీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరుగనున్న ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం దాదాపు 90 నిమిషాలపాటు జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. బిమ్‌స్టెక్ దేశాల అధినేతలతోపాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధాని మోదీతోపాటు పలువురు మంత్రివర్గ సహచరులతో ప్రమాణం చేయించనున్నారు. మొత్తం 65 మంది ప్రమాణం చేసే అవకాశం ఉన్నది. అంతకుముందు మోదీ.. మహాత్మాగాంధీ, వాజపేయి స్మారకాల వద్ద నివాళులు అర్పించనున్నారు.

బిమ్‌స్టెక్ దేశాల ప్రతినిధులతో సహా మొత్తం ఎనిమిది వేల మంది మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతారని అంచనా. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మయన్మార్ అధ్యక్షుడు యూ విన్ మైంట్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లోటై షెరింగ్, థాయిలాండ్ ప్రత్యేక ప్రతినిధి గ్రిసాడా బూన్రచ్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఈ వేడుకలో పాల్గొననున్నారు. వీరితోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, వివిధ రాష్ర్టాల సీఎంలు, వివిధ రంగాల ప్రముఖులు, నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అనిల్ అంబానీ, గౌతమ్ అదాని, రతన్ టాటా, రాహుల్ ద్రావిడ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షారుఖ్ ఖాన్, కంగనారనౌత్, రజినీకాంత్ వంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయన్నారు. పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన రాజకీయ అల్లర్లలో హత్యకు గురైన దాదాపు 40 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలు ఈ వేడుకకు హాజరవుతున్నాయని బీజేపీ నేత ముకుల్ రాయ్ తెలిపారు.

Related posts