దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, ఎందుకు తగ్గుతున్నాయో సామాన్యులకు అర్థంకాని పరిస్థితి. గతంలో ఎన్నికల సందర్భంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగినా కూడా దేశంలో ధరలు స్వల్పంగా తగ్గిస్తూ వచ్చారు. మళ్ళీ ఎన్నికలు అయిపోగానే అంతే స్వల్పంగా పెంచుకుంటూపోతున్నారు. కానీ కారణం మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రభావం భారత్ పైనా పడింది అని చెప్పుకొస్తున్నారు. దీనితో నేడు కూడా పెట్రోలు ధరలు పెరిగాయి.
మంగళవారం నాడు లీటరు పెట్రోలుపై 10 పైసలు, డీజిల్ పై 9 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీనితో ముంబైలో అత్యధికంగా పెట్రోలు ధర రూ. 76.64కు చేరగా, ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 71ని దాటింది. మెట్రో నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 76.64కు, డీజిల్ ధర రూ. 69.30కు చేరగా, కోల్ కతాలో పెట్రోలు ధర రూ. 73.11కు డీజిల్ రూ. 67.95కు పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 73.72కు, డీజిల్ ధర రూ. 69.91కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 75.34కు, డీజిల్ ధర రూ. 71.95కు చేరుకోగా, విజయవాడలో పెట్రోలు ధర రూ. 75.12, డీజిల్ ధర రూ.71.33గా ఉంది.