ప్రకృతియే పలు వర్ణాల ,వర్ణనల సందోహం
మానవాళికి ఇచ్చెను జీవిత సందేశం
ప్రభాత సూర్యునిఉషోదయ అరుణ కిరణం
లోకాన్ని జాగృత పరచి జీవిత గమనాన్ని
ప్రారంభించమని తొలి సందేశం
ఆకాశమంతా “అంబరం”లాచుట్టిన నీలి వర్ణం
నీలో ఆకాశమంత విశాల హృదయములో..
అందరితోఆత్మీయ బంధముతో చుట్టి ,చోటివ్వమని సందేశం
నింగిలో కదలాడు తెల్లని మేఘవర్ణములు..
తమలో నింపుకున్న స్వచ్ఛమైన నీరములా
నీల నిర్మలమైన మనస్సు లో ప్రేమామృతం నింపుకొనమని “తెలుపు”సందేశం
పుడమి తల్లి మోస్తున్న ఆకుపచ్చని వరిపైరు చెప్పెను
తనలాగే తల్లి గర్భాన్ని చీల్చుకు పుట్టిన కడుపు పంటలుగా
నరులు కూడా పుట్టింది పరులసేవకే అని చెప్పే సందేశం
ఆ మోదుగు చెట్లకు పూసి,రాలినకాషాయపు గోగుపూల వర్ణం
తనలాగే మోడు వారిన ..నీ జీవితంలో మళ్లీ ఆశలు
చిగురిస్తాయని ధైర్యాన్ని నింపే సందేశం
సంధ్య వేళఅలసిపోయి అస్తమించే సూర్యుని ఎరుపుబింబ వర్ణం
ఈరోజు ఓటమి ఎదురైనా ..అలసిపోయిన నీలో..రేపటి రోజూ
మళ్లీ గెలుపుతో..వెలుగులోకి వస్తావని సందేశం
చీకట్లు నింపుకున్న నలుపు వర్ణం చెప్పెను
చిరు గుండెనుబాధించిన విషాదాలకు..వివాదాలకు స్వస్తిపలకి
రేపటి రోజును .. కొత్తగా ప్రారంభించమని సందేశం
చివరికి ..ఆ ఇంద్రధనస్సులో సప్తవర్ణాల అనుబంధం
ఉన్నది కాసేపైనా ..నీవు బ్రతికి నన్నాళ్ళు “వర్ణ బేధం “చూపక
ఐకమత్యంతో కలిసి బ్రతకమని చెప్పెను ఆ హరివిల్లు సందేశము🌈🌈🌈🌈హోళి పండుగ శుభాకాంక్షలతో.
.మీ దేశపతి మోహన్