మరోసారి వెండితెరను పంచుకునేందుకు జాకీచాన్, సోనూసూద్ సిద్ధం అయినట్టే తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘కుంగ్ ఫూ యోగా’. 2017లో యాక్షన్ కామెడీగా వచ్చిన ఈ సినిమాలో దిశా పటానీ, అమైరా దస్తూర్ కథానాయికల పాత్రలు పోషించారు. యాక్షన్ కామెడీ చిత్రంగా దర్శకుడు స్టాన్లీ టోంగ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు చక్కటి స్పందన రావడంతోపాటు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు లభించాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
రెండు రోజుల క్రితం సోనూసూద్ దుబాయ్లో జాకీచాన్ను కలిశారు. ఈ సందర్భంగా ‘కుంగ్ ఫూ యోగా 2’ గురించి చర్చించుకున్నారట. త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలిసింది. సినిమా స్క్రిప్టును కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. జాకీచాన్ ప్రస్తుతం ‘వ్యాన్ గార్డ్’ సినిమాలో నటిస్తున్నారు. సెక్యూరిటీ టీం ఓ ధనికుడిని, అతడి కుమార్తెను ఉగ్రవాదుల నుంచి కాపాడే కథాంశంతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సోనూసూద్ ఇటీవల ‘సింబా’తో మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కన్నడలో ‘కురుక్షేత్ర’ సినిమాలో నటిస్తున్నారు. తమిళ సినిమా ‘దేవి 2’లో అతిథి పాత్ర పోషిస్తున్నారు.