రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపిన డేటా చోరీ కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని తెలంగాణ సిట్ ఇన్ఛార్జి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మాదాపూర్లోని ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో సాంకేతిక నిపుణుల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అమెజాన్, గూగుల్ నుంచి స్పందన రావాల్సి ఉందని.. అందు కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు సీజ్ చేసిన పత్రాలు, డివైజ్లను న్యాయస్థానానికి సమర్పిస్తామని చెప్పారు. అన్ని కంప్యూటర్లను క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని, స్వాధీనం చేసుకున్న కీలక సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నామన్నారు. హైకోర్టులో అశోక్ క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.