ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దుండగులు రెచ్చిపోయారు. ఇంటి ముందు నిలిపిఉంచిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 13 బైక్ లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన గుంటూరు శివార్లలోని నల్లచెరువు వద్ద చోటుచేసుకుంది. నల్లచెరువు ప్రాంతంలోని స్థానికులు తమ వాహనాలను ఇంటిబయట పార్క్ చేశారు.
అయితే కొందరు దుండగులు నిన్న అర్ధరాత్రి దాటాక బైక్ లపై అక్కడికి చేరుకున్నారు. అనంతరం వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో ద్విచక్ర వాహనాలను వ్యాపించిన మంటలను ఎవరూ ఆర్పేందుకు అవకాశం లేకపోయింది. తమ వాహనాలు కాలి బూడిదవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.