దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కేంద్రం క్లారీటీ ఇచ్చింది. ఉన్నత విద్యా సంస్థలలో పరీక్షల నిర్వహణకు కేంద్ర హోంశాఖ పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల కారణంగా చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తారనే ఊహాగానాలకు తెరపడినట్లయింది.
యూనివర్సిటీ అఫ్ గ్రాంట్స్ కమిషన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ 2020, పరీక్షల నిర్వహణపై ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాలలో మార్పులు ఉండవని యూజీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అన్ని కోర్సులలో ఫైనల్ టర్మ్ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని, యూజీసీ మార్గదర్శకాలకు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు లోబడి, కరోనా నియమాలు పాటిస్తూ పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమ్ శాఖ సూచించింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు యూజీ, పీజీ పరీక్షలను ఇప్పటికే రద్దు చేశాయి.