ఏడాది నిషేధం తర్వాత స్టార్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తిరిగి ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ కోసం సోమవారం ఉదయం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆదేశ ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఇందులో మాజీ సారథి స్మిత్, వార్నర్లకు చోటు కల్పించారు. మార్చి 2018లో నిషేధం తర్వాత ఇప్పటి వరకు వీరిద్దరూ ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ వారి సామర్థ్యంపై నమ్మకముంచిన ఆసీస్ మేనేజ్మెంట్ మెగా టోర్నీకి ఎంపిక చేసింది.
మొత్తం 15 మంది ఆటగాళ్ల జాబితాను ఆసీస్ ఇవాళ ప్రకటించింది. ఫాస్ట్బౌలర్ హేజిల్వుడ్ను పక్కన పెట్టేశారు. ఇద్దరు స్పిన్నర్లు ఆడం జంపా, నాథన్ లైయన్లతో పాటు పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, బెహ్న్రెండార్ఫ్, రిచర్డ్సన్, నాథన్ కౌల్టర్ నైల్ చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినీస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, జే రిచర్డ్సన్, పాట్ కమిన్స్, బెహ్న్రెండార్ఫ్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడం జంపా, నాథన్ లైయన్ స్మిత్, వార్నర్ల చేరికతో జట్టు మరింత బలంగా మారిందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ప్రపంచకప్ వరకు ఆ దేశ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ను క్రికెట్ ఆస్ట్రేలియా సహాయ కోచ్గా నియమించిన సంగతి తెలిసిందే. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. మరో ఆటగాడు బాన్క్రాఫ్ట్పై తొమ్మిది నెలలు వేటు వేసిన సంగతి తెలిసిందే.