తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశముందని వస్తున్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీ వాసులు స్వస్థలాలకు ప్రయాణం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కనపడింది.
ఏపీ , తెలంగాణ సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచాయి. దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్ట్తో పాటు, కొరపహాడ్ టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్ టోల్ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి.
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై కూడా భారీగా రద్దీ ఉండడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఈ-పాసులు లేకపోవడంతో కొన్ని వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో సొంతూళ్లకు వెళ్దామనుకున్న కొందరు నిరాశతో వెనుదిరుగుతున్నారు.