ఏపీలో మరో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనికోసం రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 150-200 ఎకరాల్లో ఈ కొత్త వర్సిటీ రూపుదిద్దుకోనుంది. అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచ స్థాయి వర్సిటీగా దీన్ని తీర్చిదిద్దేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఆర్జీయూకేటీ వీసీ రామచంద్రరాజు, డైరెక్టర్ సుదర్శనరావు, జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ ప్రసాదరాజు, ఏఎన్యూ లా ప్రొఫెసర్ రంగయ్య, ఎం.వి.ఎన్. శర్మ దీనిలో సభ్యులు.
తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైన ఈ కమిటీ, కొత్త వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలను కొత్త వర్సిటీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కోర్సులతో పాటు భావితరాల విద్యార్థులకు ఉపాధినిచ్చే కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆర్కిటెక్చర్, ఫార్మసీ, పెట్రోలియం, ఏరోనాటిక్స్, విండ్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, లాజిస్టిక్స్, వాటర్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఆధునిక వ్యవసాయ సాంకేతిక కోర్సులను కమిటీ ప్రతిపాదించనుంది. ఫ్యాకల్టీ నియామకాలూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని సూచించనుంది. అన్నీ కుదిరతే 2019-20 విద్యా సంవత్సరం నుంచే కొత్త వర్సిటీ ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది.