రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన కాలంలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామనాయుడు వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ పాలనగాడిలో పెడుతున్నామన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొస్తారని తెలిపారు.
2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ వన్గా ఉంచాలని శ్రమిస్తున్నారని వెల్లడించారు. ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి జగన్ అడుగడుగునా రాక్షసతత్వంతో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్ట్ 41.5 నుంచి 45.7 మీటర్ల ఎత్తుపైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పోలవరానికి విధ్వంసం తీసుకువచ్చింది జగన్ అంటూ విరుచుకుపడ్డారు.
2027, డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. 2025, డిసెంబర్ నాటికి డయాఫ్రంవాల్ పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.
45.72 మీటర్ల ఎత్తులో ఎలాంటి మార్పు లేదన్నారు. సెకండ్ ఫేజ్లో నిర్వాసితులకు పూర్తిగా క్లియర్ చేసి అప్పుడు దాన్ని 45.7 నీటిని నిల్వ చేస్తామని వెల్లడించారు.
పోలవరం నిధులను కూడా మళ్లించిన వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఈ ఏడాది లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
పోలవరంలో, బనకచర్లలో వృధాగా పోయిన నీటిని, రాయలసీమకి పంపించాలన్నది తమ ఆలోచన అని చెప్పుకొచ్చారు.
గోదావరిలో సుమారు మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందన్నారు. వరద సమయంలో మాత్రమే 200 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తున్నామన్నారు.
రాష్ట్రాలు వేరు కావచ్చు పార్టీలు వేరు కావచ్చు కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే అని.. ఆ నీటిని వినియోగించుకుని లబ్ధి పొందాలని చెప్తున్నామన్నారు.
జగన్ పొరుగు రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. ఎగువ రాష్ట్రాల హక్కులు తీరిన తర్వాత వృధా జలాల సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా భాగస్వామి చేస్తామని చెప్పారు. ఆ ప్రాజెక్టు ద్వారా కచ్చితంగా ఆదాయం సమకూరే మార్గాలని చూస్తామని తెలిపారు.
హంద్రీనివకు జగన్ ఒక తట్ట మట్టి గానీ ఒక రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయత్నం చేస్తామన్నారు.
కరువు లేని రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. జలమే జీవితంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వెల్లడించారు.
జగన్ తలకాయలకి, మామిడి కాయలకి తేడా లేకుండా తొక్కించకుపోతున్నారంటూ మండిపడ్డారు. గతంలో పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారు ఇప్పుడు రావాలంటే జగన్ రాడని నమ్మకం ఇవ్వండి అని అడుగుతున్నారన్నారు.
అప్పుడు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ను కాపాడింది చంద్రబాబు అని స్పష్టం చేశారు. ఋషికొండ ప్యాలస్ను ఏం చేయాలో ఇప్పటికీ తమకు అర్థం కావడం లేదన్నారు.
ఉత్తరాంధ్రకు విశాఖకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఉత్తరాంధ్రపై జగన్ కపట ప్రేమను చూపించారంటూ మండిపడ్డారు.
వంశధార, తోటపల్లి ఏడాదిలో పూర్తిచేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అందరం కలిసి చేస్తామని.. పార్టీ కార్యక్రమం ఎవరికి వారే చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.