ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ నేత చంద్రబాబు పర్యటనపై ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ నేత రోజా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ అమరావతిలో కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇసుక కొరత, ఇంగ్లీషు మీడియం అంశాలపై చంద్రబాబు తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారని అన్నారు.
దీంతో ఆయన ‘యూ’ టర్న్ తీసుకున్నారని, ఇప్పుడేమో అమరావతి పర్యటనకు వెళ్లారని విమర్శించారు. జగన్ పై బురదజల్లాలని టీడీపీ ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకీ ఒక్క సీటును కూడా రాదని జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలను జెట్ స్పీడ్ లో అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ కు అందరూ జేజేలు పలుకుతున్నారని ప్రశంసించారు.