ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి(83) మృతి చెందారు. కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్లో ఉంటున్న ఛాయాదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఛాయాదేవి 1933 అక్టోబర్ 13న రాజమహేంద్రవరంలో జన్మించారు. నిజాం కాలేజీలో ఎం.ఏ. పూర్తి చేశారు. 1953లో కాలేజీ మ్యాగజైన్ లో తొలి సారిగా రాసిన “అనుభూతి” అనే తొలి కథ ప్రచరణ జరిగింది.
అప్పటి నుంచి ఛాయాదేవి మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించిచాలా కథలు రాశారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. ఆమె కథల్లో బోన్సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆమె రాసిన బోన్ సాయ్ బ్రతుకు అనే కథని 2000 విద్యా
సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది.