రాష్ట్రంలో మే 27న (సోమవారం) నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో అన్ని వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.
మే 27న పోలింగ్ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలతోపాటు అన్ని కల్లు కంపౌండ్లు సైతం 48 గంటల పాటు మూతపడనున్నాయి.
మే 25వ తేదీన శనివారం సాయంత్రం 4 గంటల నుంచి మూసివేత నిర్ణయం అమలు కానుంది.
తిరిగి మే 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు మద్యం షాపులు ఓపెన్ కానున్నాయి.
“అయితే ఈ బంద్ రాష్ట్రం మొత్తం కాదు.” ఎన్నికలు జరుగుతున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వైన్ షాపులను మాత్రమే బంద్ చేయనున్నారు.
ఆ జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజైన జూన్ 4న కూడా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.

