తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
పొరుగు రాష్ట్రాలతో చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేసిన ఆయన, నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని సూచించారు.
వివాదాలు, పంచాయితీలకన్నా సమస్యకు శాశ్వత పరిష్కారమే తనకు ముఖ్యమని వెల్లడించారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన తెలంగాణ ప్రాజెక్టులకు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డంకులు సృష్టించకూడదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం ఎలాంటి ఘర్షణలు కోరుకోవడం లేదని, అయితే నీటి సమస్యకు స్థిరమైన పరిష్కారం మాత్రం తప్పనిసరిగా కావాలని అన్నారు.
ఈ సందర్భంగా “పంచాయితీలు కావాలా? నీళ్లు కావాలా?” అని ప్రశ్నిస్తే, తెలంగాణకు నీళ్లే కావాలని తాను స్పష్టంగా చెబుతానని సీఎం వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడమే తమ విధానమని రేవంత్ రెడ్డి తెలిపారు.

