గత 9 ఏళ్లలో జలమండలి సాధించిన ప్రగతి
దశాబ్ది ఉత్సవాల్లో మంచినీళ్ల పండగ సందర్భంగా ప్రత్యేక కథనం
నీరే సమస్త జీవకోటికి జీవనాధారం. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతగలం కానీ నీరు లేకుండా జీవించడం అసాధ్యం. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణ జలమండలి నిర్వర్తిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నగర వాసుల దాహార్తిని తీరుస్తోంది. దీనికోసం హైదరాబాద్ నలుమూలలా తాగునీటి రిజర్వాయర్లతో పాటు మంచినీటి శుద్ధి కేంద్రాలను నిర్మించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా ఔటర్ రింగు రోడ్డు పరిధి వరకు తాగునీరు సరఫరా చేస్తుంది. రాబోయే 50 ఏళ్ల వరకు తాగునీటి సరఫరాకు భరోసా కల్పిస్తూ.. 100శాతం మురుగు శుద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా అస్థిత్వం కూడా పోగొట్టుకుని నిర్వహణ భారంతో అప్పులు ఒకవైపు, నెలనెలా తడిసి మోపెడైన కరెంటు బిల్లులతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితి మరోవైపు.. వెరసి బోర్డు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ప్రభుత్వానికి పరిస్థితిని ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. చలించిన దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ఏర్పాటు కాక ముందు పరిస్థితి. కానీ.. 2014లో తెలంగాణ ఏర్పాటు కావడం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర రావు గారు హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి పూనుకున్నారు. ఒక విశ్వనగరానికి అవసరమైన మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ పటిష్ఠంగా ఉంటేనే అది సాధ్యం అవుతుందని భావించి.. జలమండలికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రతి బడ్జెట్లోనూ నిధులు కేటాయించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దిశానిర్దేశం, పురపాలక మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ నాయకత్వంలో అటు తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధిని సమర్థంగా నిర్వహిస్తూ జలమండలి ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటోంది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ.. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాలకు సైతం తాగునీరు అందిస్తుంది. అంతేకాకుండా నగర శివారు ప్రాంతాల వరకు సీవరేజి నిర్వహణ బాధ్యతలు చేపట్టి తన సేవలను మరింత విస్తృత పరిచింది. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీ నరసింస్వామి దేవాలయం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిసరాల్లో భూగర్భ డ్రైనేజీ, వరద నీటి కాలువ వ్యవస్థల నిర్మాణ బృహత్తర ప్రణాళికను రూపకల్పన చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జలమండలిపై పెట్టింది. ఈ బాధ్యతను జలమండలి సమర్థంగా నిర్వహించి పూర్తి చేసింది.

ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందిస్తోంది. నగరంలో వరుసగా అయిదేళ్లు కరవు వచ్చినా.. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేకుండా సుంకిశాల వంటి ప్రాజెక్టు రూపొందించి శరవేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తోంది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నూతనంగా 31 మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ), ఎఫ్ఎస్టీపీలను ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తోంది. తక్కువ ధరకే వినియోగదారులకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సేవల్ని అందిస్తోంది. ఇదీ గత పదేళ్లలో జలమండలి సాధించిన ప్రగతి. ప్రస్తుతం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా పయనిస్తోంది.

గడచిన 10 ఏళ్లలో జలమండలి సాధించిన మైలురాళ్లు..
- 2014
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు గారు మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి రూ.338.54 కోట్ల వ్యయంతో 9 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణానికి తేది: 02.11.20214న శంకుస్థాపన చేశారు. 2015 లో వాటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. దీని వల్ల 3.80 లక్షల ప్రజలకు లబ్ది చేకూరింది.
- 2015
- కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్-3 ని 2015 నవంబరులో ప్రారంభించారు. అదే సంవత్సరం డిసెంబరులో గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్ – 1 ని ప్రారంభించారు. కృష్ణా ఫేజ్ – 3 వల్ల 90 ఎంజీడీలు, గోదావరి ఫేజ్ – 1 వల్ల జంట నగరాలకు 85 ఎంజీడీల నీటి సరఫరా అదనంగా పెరిగింది.
- ప్రసిద్ధి చెందిన హుస్సేన్ సాగర్ పరిరక్షణ కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూకట్ పల్లి నుంచి వచ్చే మురుగు నీటిని హుస్సేన్ సాగర్ లో కలవకుండా వేరే ప్రాంతానికి మళ్లించింది. దీనికోసం ప్రభుత్వం రూ.58.96 కోట్లు వెచ్చించింది.
- 2016
- మ్యాన్ హోళ్లలో మానవ సహిత పారిశుద్ధ్య పనులు నిషేధించాలని తేది: 17.08.2016 న జలమండలి ఎండీ దానకిశోర్ సర్క్యులర్ జారీ చేశారు.
- ఉచిత వాటర్ ట్యాంకర్ల కోసం ఆటోమేటిక్ వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ (AVTS) ను 2016 నవంబరు 1 న ప్రవేశ పెట్టి అమలు చేశారు.
- 2017
- ఒక నిర్దిష్ట ప్రాంతంలో 1000 నుంచి 1500 వరకు క్యాన్ నంబర్లకు ఒక డాకెట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని వల్ల వినియోగదారుల నల్లా కనెక్షన్ల నుంచి బిల్లింగ్, రెవెన్యూ కలెక్షన్ తదితర అంశాలను సులభంగా పర్యవేక్షించవచ్చు.
- మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన – జాతీయ సఫాయి కర్మచారి ఆందోళన్ కు చెందిన బెజవాడ విల్సన్ సమన్వయంతో మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనపై జలమండలి అవగాహన కల్పించింది. తేది : 11.01.2017 నుంచి 10 రోజుల పాటు సామాజిక ప్రచార కార్యక్రమాలు చేపట్టింది.
- ఇంకుడు గుంతల ప్రాధాన్యం, వాటి నిర్మాణ అవశ్యకత ప్రజలకు తెలపడానికి జలభాగ్యం కార్యక్రమం కింద జలమండలి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను తయారు చేసింది. రెండేళ్లలో (2016-17) సుమారు 7500 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టింది. 2017 ఏప్రిల్ 21న జలభాగ్యం లోగోను ఆవిష్కరించారు.
- హైదరాబాద్ లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పర్చడమే లక్ష్యంగా.. నగరంలోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారక రామారావు గారు 70 నూతన సీవర్ క్లీనింగ్ జెట్టింగ్ యంత్రాలను 2017 జూన్ 6 న ప్రారంభించారు. ఈ వాహనాలను పారిశుద్ధ్య కార్మికులకే ఇప్పించడం వల్ల వారిని కార్మికుల నుంచి పారిశ్రామిక వేత్తలుగా ప్రభుత్వం మార్చింది.
- తాగునీటి సరఫరా, శుద్ధి, పంపింగ్, స్టోరేజీ, ట్రాన్స్ మిషన్, క్లోరినేషన్ లో జలమండలి చేపడుతున్న నాణ్యతా పద్ధతులకు 2017 జులై 14 న ఐ.ఎస్.ఒ నుంచి ధ్రువ పత్రం లభించింది. ఇది 2023 వరకు వర్తిస్తుంది.
- జలమండలి రూపొందించిన వీడియో ప్రొడక్షన్, బ్రోచర్ లకు గానూ 2017 ఆగస్టు 4 న పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డులు గెలుచుకుంది.
- మానవ రహిత పారిశుద్ధ్య నిర్వహణ పనులకు జలమండలి సీవర్ జెట్టింగ్ యంత్రాలను తీసుకువచ్చింది. ఇందుకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రశంసలు సైతం అందాయి. ఈ యంత్రాల పనితీరుపై ఎండీ దానకిశోర్ తేది 24.08.2017న దిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
- హడ్కో ప్రాజెక్టులో నగరంలోని ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.1900 కోట్ల వ్యయంతో మొత్తం 56 కొత్త రిజర్వాయర్లు, 1900 కిలో మీటర్ల పైపు లైన్ నెట్ వర్క్ నిర్మించారు. వీటిని పురపాలక మంత్రి కె.తారక రామారావు గారి తో పాటు ఇతర మంత్రులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 40 లక్షల మందికి ప్రయోజనం లభించింది.
- రింగ్ మెయిన్ ప్రాజెక్టులో భాగంగా ఆర్సీ పురం, పటాన్ చెరు, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఐటీ కారిడార్ తదితర ప్రాంతాల ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి రూ.422.80 కోట్ల తో ఘన్ పూర్ నుంచి పటాన్ చెరు వరకు 1800 ఎంఎం డయా పైపు లైన్ పనులు పూర్తి చేశారు.
- రింగు మెయిన్ ప్రాజెక్టులో భాగంగానే కొల్లూరులోని 2BHK హౌసింగ్ కాలనీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు తాగునీరందించేందుకు రూ.285 కోట్ల వ్యయంతో ముత్తంగి నుంచి కోకాపేట వరకు 3000 ఎంఎం డయా పైపు లైన్ పనులు పూర్తి చేశారు.
- జలమండలి ఎప్పటికప్పుడు తాజా సాంకేతికతను అందుకుంటూ తన సేవల్లో వినియోగించుకుంటుంది. పైపు లైన్లను మార్చటంలోనూ ఇదే పద్ధతి పాటించింది. దీనికోసం CIPP టెక్నాలజీని ఉపయోగించింది. దీని ద్వారా 1600 నుంచి 1800 ఎంఎం డయా వరకు 1.5 కి.మీ పొడవైన పైప్లైన్ ని ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిర్మించింది
- జలమండలి వినియోగిస్తున్న సీవర్ జెట్టింగ్ యంత్రాల పనితీరును తెలుసుకోవడం, అధ్యయనం చేయడం కోసం తేది: 08.09.2017న దిల్లీ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ హైదరాబాద్ వచ్చారు. అలాగే తేది: 05.10.2017న దిల్లీ జల్ బోర్డు అధికారుల బృందం సైతం జలమండలిని సందర్శించింది.
- స్వీడన్ లో 2017లో జరిగిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ (SIWI) SIWISofa లో భారత దేశం నుంచి జలమండలి ప్రాతినిథ్యం వహించింది. మిషన్ భగీరథపై జలమండలి ఎండీ దానకిశోర్ తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛమైన తాగునీటి గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు.
- స్థానికుల సమస్యలను తక్షణమే పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తేది: 16.12.2017 న “ మన నగరం / అప్నా షెహర్ ” అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఇందులో జలమండలికి చెందిన పలు సమస్యల్ని మంత్రి కేటీఆర్ తో పాటు బోర్డు ఉన్నతాధికారులు పరిష్కరించారు.
- 2018
- రింగ్ మెయిన్ ప్రాజెక్టు (వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు) లో భాగంగా గోదావరి, కృష్ణా వాటర్ ఇంటర్ కనెక్షన్ కోసం 158 కిలో మీటర్ల పొడవైన 3000 ఎంఎం డయా పైపు లైన్ పనులు పూర్తి చేశారు.
- హైదరాబాద్ నగర చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఓఆర్ఆర్ ఫేజు – 1 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ. 613 కోట్లతో 1571 కిలో మీటర్ల మేర పైపు లైన్ నెట్ వర్క్ వేయడంతో పాటు కొత్తగా 164 రిజర్వాయర్లు నిర్మించారు. దీనివల్ల 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలకు లబ్ది చేకూరింది. మొత్తం 4.36 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందారు.
- కేశవాపూర్ రిజర్వాయర్ – నగరానికి నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులో ఉండేందుకు కేశవాపురం దగ్గర రూ.4777 కోట్ల వ్యయంతో 5 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే నీటి సంక్షోభం ఏర్పడినప్పుడు ఇక్కడి నీటిని వాడుకునే వీలుంది.
- పైపు లైన్లలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు (సాలిడ్ వేస్టేజ్) తొలగించడానికి సూపర్ సక్కర్ యంత్రాలను తీసుకొచ్చారు. దీనివల్ల తొందరగా పనులు పూర్తవడంతో పాటు శారీరక శ్రమ తగ్గింది.
- పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జలమండలి తీసుకుంటున్న చర్యలకు గానూ తేది: 25.04.2018 లో Housing and Urban Development Corporation (HUDCO) అవార్డు లభించింది.
- వానాకాలంలో జలమండలి ఏటా తగిన రక్షణ చర్యలు చేపడుతుంది. 2018 వర్షాకాల ప్రణాళికలో భాగంగా 6 అడుగుల కంటే లోతుగా ఉన్న మ్యాన్ హోళ్లపై రక్షణ మూతలు (సేఫ్టీ గ్రిల్స్) ఏర్పాటు చేసింది.
- జలమండలి సీవరేజి జెట్టింగ్ యంత్రాలు ఉపయోగించి చేపడుతున్న సమర్థమైన మురుగు నీటి చర్యలకు గానూ తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డును లభించింది. దీన్ని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ జలమండలి ఎండీ దానకిశోర్ కు తేది: 21.05.2018న ప్రదానం చేశారు.
- తమిళనాడు నుంచి ఏడుగురు సభ్యులతో కూడిన వాటర్ బోర్డు అధికారుల బృందం తేది: 09.06.2018న జలమండలిని సందర్శించారు. జలమండలి చేపడున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు, ప్రాజెక్టులు తదితర వాటిని అధ్యయనం చేశారు.
- నీటి విలువ తెలియజెప్పడం, దాని వృథాను అరికట్టడం కోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి 2018 లో జలం–జీవం అనే కార్యక్రమానికి జలమండలి శ్రీకారం చుట్టింది. ఇందులో 14 ఎన్జీవోలకు చెందిన ప్రతినిధులు, 6000 మంది వాక్ వాలంటీర్లు భాగస్వామ్యం అయ్యారు. వాళ్లు నగరంలోని 21 వేల గృహాలు, 1750 కాలనీలకు వెళ్లి నీటి ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో 2K, 5K, 10K రన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్జీవోలు, మహిళా సహకార సంఘాలు, యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 150 ప్రాంతాల్లో మొత్తం 1612 కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.
- జలమండలి సరఫరా చేసే మంచి నీరు 85 శాతం సురక్షితమైందని Institute of Health Systems (IHS) ధ్రువీకరించింది.
- భావి తరాలకు వాననీటి సంరక్షణపై అవగాహన కల్పించడానికి జలమండలి జూబ్లీహిల్స్ లో థీమ్ వాటర్ పార్కు నిర్మించింది. దీన్ని అప్పటి తెలంగాణ సీఎస్ డా. ఎస్.కె.జోషి తేది: 18.10.2018న ప్రారంభించారు.
- జలమండలి అనుసరించిన Customer Satisfaction Management System కి ఐఎస్వో 10002:2014 ధ్రువపత్రం తేది: 31.10.2018 న లభించింది. తమ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించినందుకు గానూ ఈ ఖ్యాతి దక్కింది.
- సీవరేజీ నిర్వహణలో చేపట్టే చర్యలు, మావన రహిత మ్యాన్ హోల్ క్లీనింగ్ వంటి తీసుకొచ్చిన పలు సంస్కరణలకు గానూ జలమండలికి అమృత్ టెక్నాలజీ చాలెంజ్ అవార్డు అభించింది. దీన్ని దిల్లీలో తేది: 19.11.2018 న కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ జలమండలి ఎండీ దానకిశోర్ కి ప్రదానం చేసింది.
- జలమండలికి తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు లభించింది. దీన్ని తేది: 20.12.2018న అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఎండీ దానకిశోర్ కు అందజేశారు.
- 2019
- ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్ మెంట్ నిర్వహణలో భాగంగా.. 150 మంది సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లకు లైసెన్సులు, గుర్తింపు కార్డులు తేది: 12.01.2019 న జలమండలి అందజేసింది. దీని వల్ల వీరు సేకరించిన సెప్టేజ్ ని దగ్గర్లోని ఎస్టీపీలో దిగుమతి చేసే సౌకర్యం కల్పించింది.
- ఎగుడు దిగుడుగా ఉన్న మ్యాన్ హోళ్ల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు జలమండలి చర్యలు తీసుకుంది. రూ.12.56 కోట్ల వ్యయంతో అలా ఉన్న దాదాపు 17 వేల మ్యాన్ హోళ్లను రోడ్డుకు సమాంతరంగా నిర్మించడానికి మరమ్మతు పనులు చేపట్టింది.
- తాగునీటి సరఫరాలో రోజూ వారీ పరీక్షలు నిర్వహించడం, నాణ్యత ఉండేలా చూసుకోవడం ప్రధానం. ఇందులో ప్రయోగ శాల కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో జలమండలి తన పరీక్షలు, నాణ్యతను పటిష్ఠం చేసేందుకు సెంట్రల్ లాబొరేటరీని నిర్మించింది. దీన్ని తేది: 22.02.2019 న ప్రారంభించారు.
- ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణ కోసం అవగాహన కల్పించే కార్యక్రమంలో “సేవ్ వాటర్”లో భాగంగా.. తేది: 18.03.2019 న ఒక్క రోజులోనే 8 వేల ఇంకుడు గుంతలను పునరుద్ధరించారు.
- నీటి సంరక్షణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జలమండలి తేది: 22.03.2019న Water Leadership and Conservation (WaLC) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు బృందాలు ఏర్పాటు చేసింది. వారు ప్రజలకు నీటి విలువ తెలియజేయడం, వృథాగా పోతున్న నీటిని గుర్తించడం వంటివి చేశారు
- వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా తేది: 22.04.2019న వేల మంది SHGలు, RWA, WaLC వాలంటీర్ల సమక్షంలో వాక్ అలయన్స్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ పార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా.. “నీటి వృథాను తగ్గించడం” థీమ్ తో 10K రన్ సైతం నిర్వహించారు.
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన Sustainable Sanitation (స్థిరమైన పారిశుధ్యం)పై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ తేది: 19.08.2019 న నిర్వహించిన జాతీయ వర్క్ షాప్ లో జలమండలి ఎండీ దానకిశోర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
- జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ మన్హర్ వాల్జి భాయ్ జాలా, సభ్యుడు జగదీష్ హర్మనీ తేది: 19.09.2019, 16.10.2019 న జలమండలిని సందర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఉపయోగించే మినీ సివర్ జెట్టింగ్ యంత్రాల పనితీరును తెలుసుకోవడంతో పాటు బోర్డు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు.
- హైదరాబాద్ లోని పలు పరిశ్రమలకు వేగంగా నీటి కనెక్షన్ మంజూరు చేసినందుకు జలమండలికి టీఎస్ ఐపాస్ అవార్డు వచ్చింది. దీన్ని తేది: 04.12.2019న రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కె. తారక రామారావు గారు జలమండలి ఎండీ దానకిశోర్ కు బహూకరించారు.
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. జలమండలికి వచ్చిన తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్వర్జేషన్ అవార్డును తేది: 20.12.2019న ఖైరతాబాద్ లోని ఇంజినీర్స్ ఇన్ స్టిట్యూట్ లో జరిగిన కార్యక్రమంలో ఎండీ దానకిశోర్ కు అందించారు.
- 2020
- మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించడానికి Online Continuous Effluent Monitoring System (OCEMS) ని ప్రారంభించారు. దీని ద్వారా ఎస్టీపీల ఇన్ లెట్, అవుట్ లెట్ అధ్యయనంతో పాటు BOD, COD, TSS, pH మొదలైనవాటిని తనిఖీ చేయవచ్చు.
- భారత ప్రభుత్వ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా తేది: 09.01.2020న జలమండలిని సందర్శించారు. నీటి సంరక్షణపై నిర్వహిస్తున్న వాక్ కార్యక్రమం, ఎస్టీపీలపై సమీక్షించారు.
- నీటి సంరక్షణ విలువ ప్రజలకు తెలియజేయటానికి జల గీతం పేరుతో ప్రత్యేక గీతాన్ని జలమండలి తయారు చేసింది. నీటి సంరక్షణ విలువ, వాడుకునే పద్ధతులు, దాని వల్ల ఫలితాలు తెలియజేయడమే దీని లక్ష్యం. ఈ గీతం 2020 మార్చిలో యూట్యూబ్ లో విడుదల చేశారు.
- జలమండలి పవర్ టారిఫ్ కట్ – తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ HMWSSB కోసం విద్యుత్ యూనిట్ ధరను రూ.6.15 నుంచి రూ.3.95కి తగ్గించింది. దీని వల్ల బోర్డుకు నెలకు రూ.25 కోట్లు, సంవత్సరానికి రూ.270 కోట్లు విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. దీనికి చొరవ చూపిన మంత్రి కేటీఆర్ కు ఎండీ దానకిశోర్ తో పాటు డైరెక్టర్లందరూ కృతజ్ఞతలు తెలిపారు.
- బోర్డులో పేరుకు పోయిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుది. దీనికోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) పేరుతో పథకాన్ని ప్రారంభించింది. తేది: 01.08.202 నుంచి తేది: 15.11.2020 వరకు మొత్తం మూడున్నర నెలల పాటు అమల్లో ఉంది. దీనివల్ల వినియోగదారుల నుంచి బోర్డుకు రూ.285 కోట్లు వసూలయ్యాయి.
- హైదరాబాద్ లో 2020 అక్టోబరు 13 న భారీ వర్షం కురిసింది. దీంతో మరుసటి రోజు అనగా 14 వ తేదీన హిమాయత్ సాగర్ జలాశయం గేట్లు ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు మూసీ నది, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా ఆ సమయంలో కలుషిత తాగునీటి సరఫరా సమస్య నివారణకు నిత్యం వేల సంఖ్యలో శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహించారు.
- తాగు నీటి శుద్ధి కేంద్రాలు, రిజర్వాయర్ల వద్దకు భారీ క్లోరిన్ సిలిండర్లను తరలించేందుకు జలమండలి ప్రత్యేక హైడ్రాలిక్ కార్గో వాహనాలు కొనుగోలు చేసింది. వీటిని తేది: 02.11.2020 న ప్రారంభించారు.
- సురక్షితమైన పద్ధతిలో తాగునీటిని సరఫరా చేసేందుకు జలమండలి LoRaWAN అనే టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇందులో పబ్లిక్, ప్రైవేటు నెట్ వర్క్ లను భాగస్వామ్యం చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో నీటి మీటర్లను బిగించే పనులు పురోగతిలో ఉన్నాయి.
- 2021
- రాష్ట్ర ప్రభుత్వం గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగర వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తుంది. ఈ పథకాన్ని తేది: 12.01.2021న బోరబండలోని ఎస్పీఆర్ హిల్స్ లో పురపాలక మంత్రి కె.తారక రామారావు గారు ప్రారంభించారు. ఇది 2020 డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చింది. జలమండలి పరిధిలోని 97 శాతం మంది గృహ వినియోగదారులు ఈ పథకం వల్ల లబ్ది పొందారు.
- The Institute of Health Systems (IHS), Hyderabad 2020-21 సంవత్సరానికి తన నివేదికను ఇచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం.. నగరంలో 91.5 శాతం మంది వినియోగదారులు జలమండలి సరఫరా చేసే తాగునీటిపైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా 80 శాతం గృహ వినియోగదారులు జలమండలి నీటిని రెండో సారి శుద్ధి చేయకుండా.. నేరుగా తాగుతున్నారు.
- సీవర్ క్లీనింగ్ ఆపరేషన్లలో బకెట్ కాంక్రీట్ మిక్చర్ టెక్నాలజీని జలమండలి ఉపయోగించడం ప్రారంభించింది.
- కర్ణాటక నుంచి 15 మంది సభ్యులతో కూడిన అధికారుల బృందం జలమండలి నిర్మించిన థీమ్ పార్కును తేది: 26.02.2021 న సందర్శించారు. వాన నీటి సంరక్షణ పద్ధతుల గురించి అధ్యయనం చేశారు.
- ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలమండలిలో మేనేజర్ పోస్టులు భర్తీ చేసింది. కొత్తగా మేనేజర్లుగా ఎంపికైన వారికి పురపాలక మంత్రి కేటీఆర్ తేది: 08.04.2021న అపాయింట్ మెంట్ లెటర్లు అందించారు.
- ఫీకల్ స్లడ్జ్, సెప్టేజ్ మేనేజ్ మెంట్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, సేవల్ని మరింత పటిష్ఠం చేసేందుకు జలమండలి డయల్ ఎ సెప్టిక్ ట్యాంకర్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పలు నూతన సెప్టిక్ ట్యాంక్ వాహనాలను తేది: 17.07.2021న హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో పురపాలక మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
- ఫతేనగర్ లో 100 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న నూతన ఎస్టీపీకి తేది: 06.08.2021న పురపాలక మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
- పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మురుగు, సెప్టేజ్ ని సురక్షితంగా విడుదల చేసే పద్ధతులు ఆచరిస్తున్నందుకు గానూ కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జలమండలికి వాటర్ ప్లస్ అవార్డును తేది: 20.08.2021న అందించింది.
- డయల్ ఏ సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జలమండలి సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. తేది: 16.08.2021 నుంచి 16.09.2021 దాకా జరిగిన ఈ కార్యక్రమంలో 14 ఎన్జీవోలకు ప్రతినిధులు జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 66 వార్డుల్లో అవగాహన కల్పించారు. అడ్మనిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సమన్వయంతో వీటిని నిర్వహించారు.
- జలమండలిలో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేసింది. తేది: 20.09.2021న ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వీటిని ఉద్యోగులకు అందజేశారు. దీని వల్ల వారికి రూ. 3 లక్షల విలువైన ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీనికోసం ఏటా ఇన్సూరెన్స్ ఏజెన్సీలకు రూ.6.78 కోట్లు చెల్లిస్తుంది. దీనివల్ల సుమారు 4 వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు.
- నగరంలో వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మించడానికి ప్రభుత్వం తేది: 22.09.2021న జీవో నం.669 విడుదల చేశారు. వీటిని 3 ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. అంతేకాకుండా సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ లో భాగంగా.. తాగునీటి సరఫరా కోసం పైపు లైన్ల నిర్మాణం, సీవరేజీ నెట్ వర్క్ ని మెరుగు పర్చడానికి రూ.5066 కోట్లు కేటాయించింది.
- అస్సాం, జార్ఖండ్,, మధ్య ప్రదేశ్, చండీగఢ్, దిల్లీ ల నుంచి యూనిసెఫ్ అధికారుల బృందం తేది: 21.10.2021న జలమండలిని సందర్శించింది. అందులో భాగంగా వారు ఎఫ్ఎస్టీపీ, ఫీకల్ స్లడ్జ్ సెప్టేజ్ మేనేజ్ మెంట్ నిర్వహణ ప్రాంతాలను పరిశీలించి అధ్యయనం చేశారు.
- జలమండలికి బెస్ట్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ (External Public Category) విభాగంలో పీఆర్ఎస్ఐ అవార్డు-2021 లభించింది. దీన్ని పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తేది: 16.08.2021 నుంచి 15.09.2021 వరకు సీవరేజీ ఆపరేషన్స్ లో భాగంగా నిర్వహించిన సఫాయి మిత్ర సురక్షా ఛాలెంజ్, సేఫ్టీ అవేర్ నెస్ కార్యక్రమంలో అవార్డు వచ్చింది.
- 2022
- హైదరాబాద్ నగర చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు ఓఆర్ఆర్ ఫేజు – 2 ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తేది: 24.01.2022న రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజక వర్గం అల్కాపూర్ టౌన్ షిప్ వద్ద పురపాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 17 గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల నివసించే 6.32 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. దీనికోసం రూ.587 కోట్ల వ్యయంతో కొత్తగా 2864 కిలో మీటర్ల మేర పైపు లైన్ ను వేస్తున్నారు.
- కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో నూతనంగా నిర్మించే ఎస్టీపీలకు పురపాలక మంత్రి కేటీఆర్ గారు తేది: 25.01.2022న శంకుస్థాపన చేశారు.
- మహేశ్వరం మండలంలో ఓఆర్ఆర్ ఫేజు – 2 లో భాగంగా చేపట్టే పలు తాగునీటి అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ తేది: 29.01.2022న శంకుస్థాపన చేశారు.
- నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని జలమండలి కంటోన్మెంట్ ప్రాంతాలకు విస్తరించింది. ఇది 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.
- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టే తాగునీటి పైపు లైన్ పనులకు మంత్రి కేటీఆర్ గారు తేది: 02.02.2022న శంకుస్థాపన చేశారు.
- ఓఆర్ఆర్ ఫేజు – 2 లో భాగంగా పలు తాగునీటి ప్రాజెక్టులకు తేది: 09.02.2022న హయత్ నగర్ లో మంత్రి కేటీఆర్ గారు శంకుస్థాపన చేశారు.
- పెద్ద చెరువు, కాప్రా చెరువు, నల్ల చెరువు ప్రాంతాల్లో నిర్మిస్తున్న 3 ఎస్టీపీలకు తేది: 11.03.2022న మంత్రి కేటీఆర్ గారు శంకుస్థాపన చేశారు.
- మిరాలం ప్రాంతంలో సీవరేజి నెట్ వర్క్ పనులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి మంత్రి కేటీఆర్ గారు తేది: 19.04.2022న శంకుస్థాపన చేశారు.
- పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ నుంచి జలమండలి మరో రెండు అవార్డులు అందుకుంది. బెస్ట్ కాఫీ టేబుల్ బుక్, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ విభాగాల్లో ఈ అవార్డులు లభించాయి.
- వేసవిలోనూ తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సుంకిశాల ఇన్ టెక్ వెల్ ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ గారు తేది: 14.05.2022న శంకుస్థాపన చేశారు. దీనికి ఇతర మంత్రుల హాజరయ్యారు. మొత్తం రూ. 2214 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
- పని జరిగే ప్రాంతాల్లో రక్షణ చర్యల పర్యవేక్షణకు జలమండలి సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ లు ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించిన వాహనాలను మంత్రి కేటీఆర్ గారు తేది: 24.09.2022న ఎన్సీసీ క్యాంపస్ లో జెండా ఊపి ప్రారంభించారు.
- ఎస్టీపీల నుంచి వెలువడే దుర్వాసను కట్టడి చేయడానికి జలమండలి వినియోగిస్తున్న అధునాతన సాంకేతికతను అధ్యయనం చేయడానికి దిల్లీ, ముంబయి, పుణే, కర్ణాటక నుంచి పలువురు అధికారులు తేది: 23.11.2022న జలమండలిని సందర్శించారు. వీరికి ఎండీ దానకిశోర్ సాంకేతికత గురించి వివరించారు.
- జలమండలిలో చేపడుతున్న ఐటీ, రెవెన్యూ సంస్కరణలను అధ్యయనం చేసేందుకు దిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్ సౌరభ్ భరద్వాజ్ తేది: 24.11.2022న ఇక్కడికి వచ్చారు.
- జలమండలిని మరో రెండు పీఆర్ఎస్ఐ అవార్డులు వరించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో బెస్ట్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ (External Publics), బెస్ట్ పబ్లిక్ అవేర్ నెస్ కార్యక్రమాలకు ఇవి లభించాయి. వీటిని తేది: 25.12.2022న భోపాల్ లో జరిగిన పీఆర్ఎస్ఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో ప్రదానం చేశారు.
- 2023
- హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి అందిస్తున్న సేవలను అధ్యయనం చేయడానికి తమిళనాడు నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన బృందం తేది: 28.01.2023న వచ్చింది. వీరిలో ఆ రాష్ట్ర అదనపు సీఎస్ మురుగానందంతో పాటు చెన్నై వాటర్ బోర్డు ఎండీ కిర్లోష్ కుమార్, చీఫ్ ఇంజినీర్ రామస్వామి ఉన్నారు. వారు తాగునీటి సరఫరా, మురుగు శుద్ధి నిర్వహణ, సాంకేతికత, రెవెన్యూ, బల్లింగ్ తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. అడిషన్ సీఎస్ జలమండలి సేవలను కొనియాడారు.
- వాటర్ డైజెస్ట్ అనే ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 2022-2023 సంవత్సరానికి 65 కేటగిరీల్లో నిర్వహించిన వరల్డ్ వాటర్ అవార్డ్స్ లో జలమండలికి గవర్నమెంట్ కేటగిరీలో ఉత్తమ ఎస్టీపీ అవార్డు లభించింది. దీన్ని తేది: 17.03.2022 న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబుకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రోజూ ఉత్పన్నమయ్యే మురుగును వంద శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దేశంలో హైదరాబాద్ పయనిస్తోందని కొనియాడారు.
- బోర్డులో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలు, మంచి పారిశ్రామిక సంబంధాలకు గానూ జలమండలికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ యాజమాన్య పురస్కారాన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. ఈ అవార్డును ఎండీ దానకిశోర్ రవీంద్ర భారతిలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా తేది:01.05.2023 న అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జలమండలి సేవలను కొనియాడారు. ప్రభుత్వ విభాగాల్లో జలమండలికి మాత్రమే ఈ అవార్డు దక్కడం విశేషం.
- ఐటీ సంస్కరణలు
- నగరంలో సరఫరా చేస్తున్న మంచినీటి నాణ్యతపై నమ్మకం కల్పించడానికి, వినియోగదారుల భాగస్వామ్యంతో నీటి సరఫరా, క్వాలిటీని ఎప్పటికప్పుడు పరీక్షించడం కోసం “ నాణ్యత ” పేరుతో ప్రత్యేకంగా యాప్ రూపొందించింది. జలమండలి పరిధిలోని ఆయా సర్కిళ్లలో దాదాపు 12 వేల మంది జలమిత్ర వినియోగదారులను ఏర్పాటు చేసి వారి నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.
- జలమండలిలోని కార్యక్రమాలు ఆన్ లైన్ లో చేయడానికి వీలుగా.. ఈ – ఆఫీసు విధానాన్ని తీసుకువచ్చారు. దీని వల్ల పనులు వేగంగా పూర్తి కావడంతో పాటు పారదర్శకంగా జరుగుతాయి.
- యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్) – జలమండలిలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లో కాంట్రాక్టులు, టెండర్లు ఇతర పనుల విషయంలో గతంలో ఆలస్యంగా జరిగేవి. దీనికి అడ్డుకట్ట వేయడానికి నూతనంగా యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్) తీసుకొచ్చింది. దీని వల్ల పనులు నిర్ణీత గడువులో పూర్తవడంతో పాటు నిధుల వృథా తగ్గింది.
- గణనీయంగా తగ్గిన ఫిర్యాదులు – తాగునీరు, మురుగు నిర్వహణకి సంబంధించి ఫిర్యాదులు చేయడానికి ఏర్పాటు చేసిన ఎంసీసీకి గతంలో భారీగా ఫిర్యాదులు వచ్చేవి. తర్వాతి కాలంలో చేపట్టిన పలు సంస్కరణల వల్ల ఇవి ప్రస్తుతం గణనీయంగా తగ్గాయి.
2014 నుంచి 2023 వరకు జలమండలి సాధించిన భారీ విజయాలు
- నెలకు20 వేల లీటర్ల ఉచిత తాగునీరు
జీహెచ్ఎంసీలో 2019 లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. నగరంలోని అన్ని గృహ వినియోగదారులు దీనికి అర్హులే. 2020 డిసెంబరులో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 11.7 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధి పొందారు. అందులో 2.5 లక్షల స్లమ్ కనెక్షన్ వినియోగదారులు ఉన్నారు. ఈ పథకం కింద మొత్తంగా నగర పరిధిలో రూ.815 కోట్లు విలువైన బిల్లులు మాఫీ చేశాం.
- రూ.1,రూ.100 కే నల్లా కనెక్షన్లు
తక్కువ ధరకే నల్లా కనెక్షన్లు ఇచ్చి జలమండలి పేదలకు అండగా నిలిచింది. దారిద్య్ర రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు రూ.1 కే న్లలా కనెక్షన్లు ఇచ్చింది. దీని ద్వారా మొత్తం 53 వేల మంది వినియోగదారులు లబ్ది పొందారు. ఇదే కాకుండా మరో 30 వేల మంది వినియోగదారులకు రూ.100 కు కనెక్షన్ ఇచ్చింది. ఈ రెండు పథకాల వల్ల మొత్తం 83 వేల మంది ప్రయోజనం పొందగా.. రూ.25 కోట్ల బెనిఫిట్ లభించింది.
- వందశాతం మురుగు శుద్ధి దిశగా అడుగులు
హైదరాబాద్ మహా నగరంలో రోజూ ఉత్పన్నమయ్యే మురగు నీటిని వంద శాతం శుద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం రూ.3866 కోట్ల వ్యయంతో 1259.5 ఎంఎల్డీల సామర్థ్యం గల కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తోంది. వీటి నిర్మాణ బాధ్యతను జలమండలిపై పెట్టింది. వీటిని మొత్తం 3 ప్యాకేజీల్లో నిర్మిస్తున్నారు.
1) ప్యాకేజీ-I లో అల్వాల్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
2) ప్యాకేజీ-II లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.33 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
3) ప్యాకేజీ-III లో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.5 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు.
ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న 1650 ఎంఎల్డీల మురుగుకు గానూ.. 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగును (46 శాతం) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. ఈ ఎస్టీపీల పనితీరు, నాణ్యతను Online Continuous Effluent Monitoring System (OCEMS) ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
ఇందులో 972 ఎంఎల్డీల సామర్థ్యం గల 13 ఎస్టీపీలను ఈ ఏడాది ఆగస్టు వరకు మిగిలిన వాటిని డిసెంబరు నాటికి అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇవి పూర్తయితే.. రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుంది.
- మురుగుశుద్ధి విధానాలు : మాన్యువల్ నుంచి యాంత్రికం వరకు
హైదరాబాద్ మహా నగరంలో పారిశుద్ధ్య విధానం పూర్తిగా మాన్యువల్ నుంచి యాంత్రికానికి మారింది. గతంలో మనుషులు శుద్ధి చేసే వారు. కానీ ఇప్పుడు పూర్తిగా యంత్రాలతో క్లీన్ చేస్తున్నారు. దీనికోసం నగర వ్యాప్తంగా మొత్తం 212 సివర్ జెట్టింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. దీంతో పాటు పైపు లైన్లలో పేరుకు పోయిన చెత్తను శుభ్ర పరచడానికి సీవర్ క్రాక్, హైడ్రాలిక్ సిల్ట్ గ్రాబర్ వంటి పరికరాలు వాడుతున్నారు. జలమండలిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు సురక్షితంగా విధులు నిర్వర్తించేందుకు దుస్తులు, బూట్లు, గ్లోవ్స్, ఇతర రక్షణ పరికరాలు అందజేస్తున్నారు.
ఈ విజయాలు హైదరాబాద్ పౌరుల శ్రేయస్సు కోసం నమ్మకమైన నీటి సరఫరా, సమర్థమైన మురుగునీటి నిర్వహణలో జలమండలి చేస్తున్న కృషి, అంకితభావానికి నిదర్శనం.

