ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్కు నెల రోజుల పాటు తాత్కాలిక వెసులుబాటు కల్పించింది.
అయితే, ఈ అనుమతికి కఠినమైన షరతులను విధించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) నిన్న జారీ చేసింది.
ఈ తాత్కాలిక లైసెన్స్ ప్రకారం ఈ నెల 5వ తేదీకి ముందే నౌకల్లోకి లోడ్ చేసిన రష్యా ముడి చమురు లేదా పెట్రోలియం ఉత్పత్తుల లావాదేవీలకు మాత్రమే ఏప్రిల్ 4వ తేదీ వరకు అనుమతి ఉంటుంది.
ఈ చమురును కేవలం భారత ఓడరేవులకు మాత్రమే చేర్చాలి. కొనుగోలు చేసే సంస్థలు కూడా భారత చట్టాల ప్రకారం నమోదైనవి అయి ఉండాలని ట్రెజరీ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
ఈ నిర్ణయంపై అమెరికా అధికారి బాసెంట్ మాట్లాడుతూ “అంతర్జాతీయ మార్కెట్లోకి చమురు ప్రవాహం కొనసాగేలా చూసేందుకే ఈ తాత్కాలిక 30 రోజుల మినహాయింపు ఇస్తున్నాం.
ఇది కేవలం సముద్రంలో ఇప్పటికే చిక్కుకుపోయిన చమురుకు సంబంధించిన లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.
కాబట్టి, దీనివల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదు. భారత్ మాకు కీలక భాగస్వామి. రానున్న రోజుల్లో న్యూఢిల్లీ అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని ఆశిస్తున్నాం.
ఇంధన మార్కెట్లను ఇరాన్ బందీగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవడానికే ఈ తాత్కాలిక చర్య” అని వివరించారు.
ఈ మినహాయింపు కేవలం పరిమితమైన, తాత్కాలిక చర్య మాత్రమేనని అమెరికా అధికారులు చెప్పారు.


మహిళలను వేధించిన వైసీపీ నేతలు దర్జాగా తిరుగుతున్నారు: పంచుమర్తి అనూరాధ