టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఈరోజు ఏపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నేడు ఛలో ఆత్మకూరుకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో బాబును నిర్బంధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబును తాము హౌస్ అరెస్ట్ చేయలేదని సవాంగ్ స్పష్టం చేశారు. చంద్రబాబు పల్నాడుకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందని తెలిపారు. అందుకే టీడీపీ అధినేతను ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.