ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య రంగంలో పెద్ద సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
ఈ కొత్త బీమా పథకం పేదలకే కాకుండా ధనికులకు కూడా వర్తించడం ప్రత్యేకత.
బీపీఎల్ కుటుంబాలకు సంవత్సరానికి రూ. 25 లక్షల వరకు, ఏపీఎల్ వర్గాలకు రూ. 2.5 లక్షల వరకు క్యాష్లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా పాలసీ రూపుదిద్దుకుంది.
రాష్ట్రంలో ఏ వ్యాధికి ఎంత ఖర్చవుతుందో, ఏ ప్రాంతాల్లో వైద్య భారము ఎక్కువగా ఉందో పూర్తిస్థాయిలో విశ్లేషించాలని సీఎం సూచించారు.
ప్రజారోగ్య రంగంలో నివారణ, చికిత్సా విధానాలు ఒకేసారి బలపడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు

