నేడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖజానాకు, చెన్నై నుంచి తిరుపతి తరలిస్తూ తమిళనాడులోని ఆవడి సమీపంలోని వేపంపట్టు చెక్పోస్టు వద్ద ఎన్నికల నిఘా బృందానికి పట్టుబడిన 1,381 కిలోల బంగారాన్ని తరలించనున్నారు. ఈ బంగారం టీటీడీకి చెందినదే అయినప్పటికీ దానిని తరలిస్తున్న వాహనాల వద్ద ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న అధికారులు పూందమల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పట్టుబడిన నగలకు సంబంధించిన ఆధారాలు చూపించడంతో వాటి విడుదలకు మార్గం సుగమమైంది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని విడుదల చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడంతో విడుదల ఆలస్యమైంది. నేడు ఈ బంగారం మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానాలో జమ చేయనున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.