ఉపాధ్యాయుల పోస్ట్ ల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక డీఎస్సీ పరీక్ష వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. అందులో భాగంగా గరిష్టంగా 54 ఏళ్ల వయస్సున్న వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తాజాగా వీరంతా దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాల్సి రావడంతో పరీక్ష కొన్నిరోజులు వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. ఈ డీఎస్సీ ప్రవేశ పరీక్ష విషయమై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.