వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో , మండల కేంద్రాల్లోటీఆర్ ఎస్ ధర్నాలు చేపట్టారు. దీనిలో భాగంగానే.. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇందిరాపార్కు వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికైన కేంద్రం.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేస్తున్నారు.
ధాన్యం కొనాల్సిన కేంద్రమే తాము కొనమని చెబితే.. రైతులు ఎక్కడికి పోవాలని.. పండించిన పంటనంతా ఏం చేయాలని మంత్రులు మోదీ సర్కార్ను ప్రశ్నించారు. కర్షకులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం నిలబడినట్లు చరిత్రలో లేదని అన్నారు. దేశమంతా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న వైఖరి పట్ల కేంద్రం మెడలు వంచేలా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నారు.
ఈ దర్నాలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవీ, దయానంద్ గుప్తా, కార్పొరేషన్ చైర్మన్లు వెంకటేశ్వర్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దేవీప్రసాద్, తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్లు, భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతునిస్తున్నారు.