తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.దక్షిణ అండమాన్ సముద్రం, పరసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో నిన్న అల్పపీడనం ఏర్పడింది.
ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, అల్పపీడనానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

