నిమ్న కులస్తులపై వేధింపులకు పాల్పడిన వారిపై విచారణ లేకుండా సరాసరి ఖైదు చేసేట్టుగా ఎస్టీ, ఎస్సీ చట్టంలో సవరణలు చేపట్టాలని ఎప్పటి నుండో కోర్టులో పిటిషన్ పై వాదనలు నడుస్తున్నాయి. తాజాగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడికి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ… ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 2018లో తీసుకు వచ్చిన నూతన సవరణలపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎస్పీ, ఎస్టీలపై వేధింపులకు పాల్పడిన వారిని ఎలాంటి విచారణ లేకుండానే అరెస్ట్ చేసేందుకు ఈ సవరణ చట్టం అనుమతిస్తోంది.
ఈ చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మార్చి 20న కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లతో కలపి, అన్ని పిటిషన్ల విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతోందని… ఈ నేపథ్యంలో తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీనితో, దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును పక్కనబెడుతూ… ఆగస్టు 9న కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును ఆమోదించింది. ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి.

