అంతర్జాతీయ క్రికెట్కు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీం ఆమ్లా వీడ్కోలు పలికాడు. వన్డేల్లో వేగంగా 7వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా హషీం ఆమ్లా రికార్డు సృష్టించాడు. 36 ఏళ్ల ఈ బ్యాట్స్మెన్ ఇప్పటిదాకా 124 టెస్ట్లు, 181 వన్డేలు, 44 అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ 2004లో ప్రారంభమైంది. కోల్కతాలో భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్తో ఆమ్లా తన కెరీర్ను ఆరంభించాడు.
ఇటీవల ప్రపంచకప్లో శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ అతనికి చివరిది. ఆ మ్యాచ్లో ఆమ్లా 80 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా ఆమ్లా మాట్లాడుతూ ”సఫారీ జట్టుతో నా ప్రయాణం విజయవంతంగా సాగడానికి సహకరించిన జట్టు సభ్యులు, సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా.. నా జట్టు సభ్యులతో సోదర సమానంగా ప్రేమను పంచుకున్నా. అలాగే తమ ప్రేమతో నాకు వెన్నుదన్నుగా నిలిచిన నా తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు” అని అన్నాడు.
ఇచ్చిన వాగ్ధానాలకు బడ్జెట్కు పొంతన లేదు: టీడీపీ నేత అనురాధ