తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 13వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొంది.
వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పదవిలో ఉన్న సమయంలోనే శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, దర్యాప్తును వేగవంతం చేసింది. కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో భాగంగా ఇప్పుడు కీలక వ్యక్తులను విచారించడంపై దృష్టి సారించింది.
ఇప్పటికే ఈ కేసులో భాగంగా దర్యాప్తు అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొంతమంది అధికారులు, నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను కూడా విచారించింది.
ఇప్పుడు మాజీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన వైవీ సుబ్బారెడ్డిని విచారించడం ద్వారా మరిన్ని కీలక వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.

