ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు.
సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.
ఈ భేటీపై సింగపూర్ దౌత్య కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.
విజయవాడలో ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది.
సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని వెల్లడించింది. ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ సమావేశం జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ పేర్కొన్నారు.