ఏపీ సీఎం అవినీతిపై వైసీపీ నేతలుచర్చకు రావాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ డిమాండ్ చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొత్తం పదహారు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, జగన్ కు సంబంధించిన నలభై మూడు వేల కోట్ల రూపాయలను సీబీఐ ఇప్పటికే జప్తు చేసిందంటూ విమర్శల వర్షం కురిపించారు.
శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎకరాలను జగన్ కొట్టేశారని ఆరోపించారు.తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10,835 ఎకరాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 51,641 ఎకరాలు కొట్టేశారని, ఈ విషయాల గురించి ఒక్క వైసీపీ నాయకుడు కూడా నోరెత్తడని ఆమె ప్రశ్నించారు.