telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రజనీకాంత్‌ పై ప్రశంసలు

సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన నట ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు రజనీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రజనీపై ప్రశంసలు కురిపించారు. ఆయనొక రియల్ సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెలబ్రెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు.

బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు.

కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం. మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయొద్దనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం.

మాకు డబ్బే ముఖ్యం, సమాజం ఎటు పోయిన మాకేంటి అనుకునే ప్రస్తుత సెలబ్రిటీలు రజిని గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు సమాజాన్ని చిద్రం చేసే సంస్థల ప్రమోషన్లకు దూరంగా ఉండాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి’ అని రాసుకొచ్చారు సజ్జనార్.

రజనీకి సంబంధించిన ఒక పేపర్ క్లిప్ ను కూడా సజ్జనార్ ట్విట్టర్ లో పంచుకున్నారు. అందులో ఏముందంటే.. ‘ మనదేశంలో ఏ వాణిజ్య ప్రకటనల్లోనూ నటించని ఏకైక స్టార్ హీరో రజినీకాంతే! ఎవరు ఎన్ని కోట్లు కుమ్మరిస్తామన్నా సరే ‘నేను ఏ యాడ్ చేసినా నా అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారు.

వాటిలోని లోటుపాట్లకి నేను బాధ్యుడిని అవుతాను. కాబట్టి ఆ సంపాదన నాకొద్దు’ అంటారు. ‘వీడియోల్లో నటించక్కర్లేదు కనీసం మీ ముఖాన్నయినా వాడుకోనివ్వండి’ అన్నా ‘నో’ చెబుతారు.

కానీ తమిళనాడు ప్రభుత్వం 1980ల్లో ప్రారంభించిన పల్సో పోలియో చుక్కల మందు వ్యాప్తికి పైసా తీసుకోకుండా నటించాడు.

రజినీ ప్రకటనతో ఆ కార్యక్రమం కుగ్రామాల్లోకి కూడా చొచ్చుకెళ్లింది. జనం ‘రజినీ పోలియో చుక్కలు’ అనడం ప్రారంభించారు. ఆ తర్వాత నేత్రదానం కోసం మరో ప్రకటనలో నటించారు. అదీ ఉచితంగానే’ అని రజనీ గురించి గుర్తు చేశారు వీసీ సజ్జనార్.

Related posts