telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు: మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం

పేదల ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడే ఎందుకు కూల్చివేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు.

అయినప్పటికీ గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని ఫైర్ అయ్యారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారని రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకీ రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బూల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే అంటూ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత తనది అంటూ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయిందని రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదని విమర్శించారు. హైడ్రా బూల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుందని పెద్దల ఇళ్లకు వెళ్లదంటూ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి సోదరుడితోపాటు మంత్రులు పొంగులేటి, వివేక్ వంటి వారు ప్రభుత్వ స్థలాల్లో, చెరువులపై ఇళ్లు కట్టినా వాటిని కూల్చివేయలేదంటూ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Related posts