విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.
పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి బాబా నిరంతరం బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వంటి మార్గాలు అనుసరణీయమని, లోక కల్యాణం కోసమే ఆయన పాటుపడ్డారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. “సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా భాగ్యం. ‘మానవ సేవే మాధవ సేవ’ అని నమ్మిన మహానుభావుల్లో ఆయన అగ్రగణ్యులు.
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం విశేష కృషి చేస్తోంది.
ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలి” అని పిలుపునిచ్చారు. 1969 నుంచే మహిళా సంక్షేమానికి బాబా ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “‘లవ్ ఆల్ సర్వ్ ఆల్’ అనేదే బాబా సిద్ధాంతమని, ఆయన ప్రవచించిన పంచ సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతితో వర్ధిల్లుతుందని అన్నారు.
“సత్యసాయి బాబాతో నాకు మంచి అనుబంధం ఉంది. తాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా ఆయన సిద్ధపడ్డారు.
ఆయన స్ఫూర్తితో భక్తులు పెద్ద ఎత్తున విరాళాలిచ్చి ఆ ప్రాజెక్టులను పూర్తి చేశారు” అని గుర్తుచేసుకున్నారు.
సత్యసాయి ట్రస్ట్ 140 దేశాల్లో 2 వేలకు పైగా శాఖలతో, 7.50 లక్షల మంది వాలంటీర్లతో సేవలందించడం అద్భుతమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం’ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

