telugu navyamedia
pm modi నరేంద్ర మోదీ వార్తలు

ట్రినిడాడ్‌లో భారత స్పీకర్ కుర్చీకి చారిత్రక ప్రాధాన్యం గుర్తు చేసిన ప్రధాని మోదీ భావోద్వేగం

ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ అయ్యారు. అక్కడి పార్లమెంట్‌కు హాజరైన మోదీ.. ఇరు దేశాల మధ్య అనుబంధం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్‌కు ఉన్న అనుబంధం, చారిత్రాత్మక సంబంధాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రసంగం మధ్యలో స్పీకర్ చెయిర్ గురించి ప్రస్తావించారు మోదీ.

దీన్ని చెక్కతో చేసిన సాధారణ కుర్చీలా చూడొద్దని.. ఇది భారత్-ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య ఉన్న స్నేహం, నమ్మకం, దృఢమైన ప్రజాస్వామ్య బంధానికి నిదర్శనమని తెలిపారు.

ప్రధాని ప్రస్తావనతో అసలు ఈ కుర్చీకి ఉన్న చరిత్ర ఏంటో కనుక్కునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. చెయిర్ హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఏళ్ల పాటు బ్రిటీష్ పాలనలో ఉన్న ట్రినిడాడ్ అండ్ టొబాగోకు 1962లో విముక్తి లభించింది. దీంతో ఈ దేశానికి 1968లో ఓ ప్రత్యేక బహుమతిని పంపించింది భారత ప్రభుత్వం.

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. పార్లమెంట్‌లో స్పీకర్ కూర్చునేందుకు ఓ ప్రత్యేక కుర్చీని తయారు చేయించి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు గిఫ్ట్‌గా పంపించారు.

ఫిబ్రవరి 8వ తేదీ, 1968న భారత హైకమిషనర్ మునీలాల్ ఈ కుర్చీని అక్కడి ప్రభుత్వానికి అందజేశారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేందుకు ఇది దోహదపడింది.

అలాంటి కుర్చీని, ట్రినిడాడ్‌తో భారత్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తాజాగా ఎమోషనల్ అయ్యారు మోదీ.

ట్రినిడాడ్ అండ్ టొబాగోకు 180 ఏళ్ల కిందే భారతీయులు వచ్చారని ప్రధాని మోదీ తెలిపారు. సుదూర ప్రయాణాలు చేస్తూ, సముద్రాలు దాటి ఇండియన్స్ ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకొచ్చారు.

కరీబియన్ నేలతో తమకు గట్టి అనుబంధం ఏర్పడిందని, ఇక్కడివారితో భారతీయులు చాలా బాగా కలసిపోయారని పేర్కొన్నారు.

రాజకీయాల దగ్గర నుంచి కవిత్వం, క్రికెట్, వ్యాపారం వరకు.. ప్రతి విభాగంలో భారతీయులు భాగస్వాములు అవుతూ కీలకపాత్ర పోషిస్తున్నారని మెచ్చుకున్నారు మోదీ.

Related posts