చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని వైసీపీపై టీడీపీ నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీల నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులకు, కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, నామినేషన్లు వేయనీయడం లేదని మండిపడ్డారు.
అధికార, వాలంటీర్ల వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైతే వైసీపీ నేతలు ఓడిపోతామనుకుంటున్నారో అక్కడ ఎన్నిక నిలిపివేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రులు, రౌడీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ నాయకులు పేట్రేగిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ నాలుగు వందలకు పైగా ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారన్నారు.
నమ్మించి నట్టేట ముంచడం జగన్ నైజం: వంగవీటి రాధా