అమరావతి: గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల వివాదం ప్రభుత్వం వర్సెస్ చిత్రపరిశ్రమగా కొనసాగుతుంది. టాలీవుడ్ హీరో నాని, హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇవాళ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంత్రి పేర్నినానితో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
ధరలను పెంచాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోరారని ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని చెప్పారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
కొందరు ధియేటర్ల లైసెన్స్లను రెన్యూవల్ చేసుకోకుండానే నడిపిస్తున్నారని మంత్రి పేర్ని నాని చెప్పారు.అనుమతులు లేకుండా నడుపుతేున్న సినిమా థియేటర్లను సీజ్ చేసినట్టుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 130 థియేటర్లను సీజ్ చేశామన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 35 జీవోను జారీ చేసిందని మంత్రి గుర్తు చేశారు. అయితే ఎప్పుడో జీవో వస్తే ఇవాళ సినిమా థియేటర్లు మూయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఎవరితోనైనా ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య అయినా వినడానికి మేం సిద్ధం అని మంత్రి పేర్ని నాని అన్నారు.
మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సినిమా థియేటర్ కు వచ్చే రెవిన్యూ కంటే కిరాణా దుకాణానికి వచ్చే ఆదాయం ఎక్కువ అని హీరో నాని చేసిన కామెంట్స్ పై మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
సినిమా థియేటర్ కు వచ్చిన రెవిన్యూ, ఆ థియేటర్ పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వచ్చిన రెవిన్యూను లెక్క గట్టే హీరో నాని కామెంట్స్ చేసి ఉంటారని మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఏ ఊర్లోని సినిమా థియేటర్, కిరాణా దుకాణం రెవిన్యూను లెక్కగట్టారో తమకు తెలియదు. బహుశా ఆయన బాధ్యతాయుతంగానే మాట్లాడుతారని సెటైర్ వేశారు మంత్రి.
అలాగే..చెన్నైలో ట్యాక్సులు కట్టే సిద్ధార్థ్కు.. ఏపీ ప్రభుత్వంతో ఏం సంబంధమని ప్రశ్నించారు. సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళనాడులో ఉంటున్నారు.. ఆయన ఏది కొనుక్కున్న తమిళనాడు ప్రభుత్వానికే వెళుతుందన్నారు. తాము కట్టే పన్నులతోనే రాజకీయ నాయకులు విలాసంగా బతుకుతున్నారని కామెంట్ చేయడం అది బహుశా ఆయన స్టాలిన్ కోసమో, మోడీ కోసమో అనుంటాడు. ఎవరి కోసమో నిర్ణయాలు తీసుకోము. ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. మేము హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటున్నాం.
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా