పాకిస్థాన్ తనకు అలవాటైన వక్ర బుద్ధిని మరోసారి ప్రదర్శించింది. పాకిస్థాన్ 88 నిషేధిత ఉగ్రవాద గ్రూపులు, వాటి నేతలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో దావుద్ ఇబ్రహీం తన గడ్డపై ఉన్నట్లు తొలిసారిగా అంగీకరించింది. ఉగ్రవాద గ్రూపుల జాబితాలో ఇబ్రహీం పేరుపై అధికారిక ధ్రువీకరణ లేకపోయినా, తాజాగా ఆంక్షలు విధించిన నాయకుల జాబితాలో దావుద్ పేరు ఉందని, ఆ దేశ మీడియా నివేదికలు బహిర్గతం చేశాయి.
పారిస్కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) 2018లో విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు 88 నిషేధిత ఉగ్రసంస్థలు, దాని అధినేతలపై ఆంక్షలు విధించింది. ఇందులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. వీరి ఆస్తులను, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. ఫలితంగా దావూద్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ అనగీకరించింది.