భారత్ కు మిత్ర దేశాలు పాక్-చైనా మెలిక పెట్టేందుకు సిద్ధం అయ్యాయి. జైషే చీఫ్ మసూద్ అజర్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయడానికి కూడా చైనా పదే పదే అడ్డు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి అంగీకరించు కానీ.. ఇండియాకు మాత్రం ఓ షరతు విధించు అంటూ చైనాకు సూచించింది పాక్. ఆ సూచన ఏంటంటే.. సరిహద్దు దగ్గర ఉద్రిక్త పరిస్థితులను తగ్గించాలి.. కాశ్మీర్తో పాటు అన్ని అంశాలపై చర్చలకు ఇండియా సిద్ధపడాలి. దీనికి భారత్ ఓకే చెబితేనే, మసూద్ అజర్ విషయంలో వెనక్కి తగ్గాలని చైనాకు పాకిస్థాన్ సూచించడం గమనార్హం. అసలు మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా సాంకేతిక కారణాలను చైనా సాకుగా చూపిస్తున్నది.
మరోపక్క అమెరికా వేరే చర్యలకు సిద్ధమవుతున్నది. అందులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చకు పెట్టడం కూడా ఒకటి. అదే జరిగితే చైనా పరువు పోతుంది. అయితే ఇప్పటికే పాక్ విధించిన షరతులను అమెరికాకు చైనా చెప్పినట్లు న్యూయార్క్లోని భారత రాయబారులు వెల్లడించారు. కానీ ట్రంప్ ప్రభుత్వం వీటిని తోసిపుచ్చింది. అసలు ఇండోపాక్ చర్చలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలిసింది. చైనా నాలుగోసారి ఈ ప్రతిపాదనను అడ్డుకున్నది. అయితే అడ్డుకోవడానికి కారణాలను రెండు వారాల్లో చెప్పాలని భద్రతా మండలిలోని సభ్యదేశాలు చైనాకు డెడ్లైన్ విధించాయి. ఈ వారంతంతోనే ఆ డెడ్లైన్ పూర్తి కానుంది. మసూద్ అజర్ పాక్ లోని బహావల్పూర్లో ఉన్నాడు. అతను ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడని తెలుస్తుంది.

